పట్టు సడలిపోకుండా పోరాటం చేస్తూ ఓపికగా కేంద్రనిర్ణయం కోసం ఎదురుచూడటం తెలంగాణ నాయకులకు,జనానికి అలవాటైంది.ఎప్పుడూ ఏమి జరగనుందో అన్నట్లుగా 24 గంటలు టీవీ ముందు కూర్చుంటున్నారు అందరూ.సకల జనుల సమ్మె ఇరవై రోజులకు చేరిన ఈ సంక్లిష్టమైన సమయంలో ఎప్పటిలాగే ,ఇప్పుడు కూడా అలాగే ఓ సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఐతే పాడిందే పాట పాసుపళ్ల దాసు అన్నట్లుగా రెండ్రోజుల తరబడి,గంటలసేపు వార్ రూమ్ లో చర్చలు సాగించిన కాంగ్రెస్ కోర్ కమిటీ మరోసారి చావు కబురు చల్లగా చెప్పింది.ఏమిటది ? తెలంగాణా తేల్చడం ఇప్పట్లో అసాధ్యం అని.ఇంకా చర్చలు అవసరమట.!సోనియా,ప్రధానితో జరిగిన భేటీ లో పదిరోజుల్లో ఓ ప్రకటన వెలువరిస్తాం అన్న నేతలు సడెన్ గా ఒకరోజు గడిచేసరికి ప్లేట్ ఫిరాయించినట్లు కనిపిస్తోంది.మళ్లీ ఇష్యూను సాగదీసేందుకే అఖిలపక్షం మాట మాట్లాడుతున్నారనిపిస్తోంది.ఇందులో ఎమైనా మతలబు ఉందేమో.? ముక్కు ఎక్కడరా అంటే తలచుట్టూ తిప్పి చూపించినట్లు తెలంగాణా ఇవ్వడం మాకు కష్టమని చెప్పడానికి కూడా రాజకీయాల్లో తలపండిన నేతలు తలలు పట్టుకుని కూర్చోవడం నిజంగా ఆశ్చర్యమేస్తోంది.కాంగ్రెస్ కోర్ కమిటీలో ఉన్న వారంతా పాలిటిక్స్ లో ఎన్నో అనుభవం కలిగి ఉండి..ఎంతటి సమస్యనైనా చిటికలో పరిష్కారం చేసే సత్తా ఉన్నవాళ్లు..అలాంటి వారు కూడా తెలంగాణ విషయంలో మాత్రం పిల్లిమొగ్గలేస్తున్నారు.ఇప్పుటికే టీ కాంగ్రెస్ నేతలు దేశరాజధానిలో మకాం వేసి వ్యూహాలు పన్నుతున్నారు.మరోవైపు కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణా జాక్ కూడా తెలంగాణా విషయంలో కేంద్రం పై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీకి వెళ్లింది.పనిలో పనిగా టైం కలిసిరావడంతో టీ జాక్ గాంధీ జయంతి రోజున బాపుఘాట్ వద్ద మౌనదీక్ష చేపట్టింది. ఈ పరిణామం జాతీయమీడియాను బాగా ఆకర్షించింది.తెలంగాణ కోసం జనాలు పిట్టల్లా రాలిపోతున్నా కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదా అని కేసీఆర్ తీవ్రంగా ప్రశ్నించారు.ఇదైనా ప్రధానికి వినిపిస్తుందో లేదో వేచిచూడాలి.ఎందుకంటే ఢిల్లీలో కేసీఆర్ పెద్దగా ఎప్పుడూ కాంగ్రెస్ నుగానీ,ప్రధానిని గానీ గట్టిగా నిలదీసినా పీఎఓం స్పందించిన సందర్భాలు లేవు.సమ్మె ఉధృతంగా సాగుతున్న టైంలో కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్న ఆశ కేసీఆర్ కు ఉండొచ్చు.కానీ వారు అనుకున్నట్లుగా దసరా తరువాతైనా ప్రకటన వస్తుందన్న కేసీఆర్ ఆశ ఒకరోజులోనే సన్నగిల్లినట్లుంది. సకలజనుల సమ్మె 15 రోజులు పూర్తైన తరువాత నేషనల్ మీడియా తెలంగాణ సీరియస్ నెస్ పై దృష్టి సారించింది.2 జీ రగడ ముగిసిన తరువాత కేంద్రం దీన్ని పరిష్కరించాలని నిర్ణయించుకుంది.ఐనా ఏం చేయాలో తేల్చుకోలేకపోతోంది.మరోవైపు అసలు సమస్య అంతా హైద్రాబాద్ తోనే ఉన్నదని పత్రికలు,ఛానళ్లు అన్ని గోల చేస్తున్నాయి.ఈ మాటలో నిజం లేకపోలేదు.కరవమంటే కప్పకు కోపం,విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా హైద్రాబాద్ విషయంలో తెలంగాణా,సీమాంధ్ర నాయకులు పట్టుపడుతున్నారు.హైద్రాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని, లేదా ఉమ్మడి రాజధాని చేస్తారని రకరకాల ఊహాగానాలు ఎప్పుడినుంచో ఉన్నాయి.తాజాగా మరోసారి అవి తెరమీదకొచ్చాయి.ఐనా కేంద్రం ఎందుకింత తాత్సారం చేస్తోందో ఎవ్వరికీ అర్దం కావడం లేదు.ఎప్పటికప్పుడు తేల్చేస్తాం అనుకున్నా మళ్లీ వెనకడుగే వేస్తున్నారు.ఇప్పుడైనా తేల్చేస్తారా అంటే మళ్లీ డిస్కషన్స్ అంటున్నారు.ఈ లోపే సీమాంధ్ర నేతల ఢిల్లీ టూర్ ఉంది.ఆ తరువాత స్టేటస్ ఏంటో తెలీదు.ఇవన్నీఓ వైపేతే స్టేట్ ఏర్పాటుకు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ అసలైన అడ్డు అని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.దీనిగురించి ఓ ఆర్నెళ్ల క్రితమే నేషనల్ మీడియాలోకధనాలు వచ్చాయి.తెలంగాణా ట్రైన్ స్టాప్డ్ ఎట్ కోల్ కతా అని.ఎందుకంటే తెలంగాణా ఇస్తే మమతా కు గూర్ఖాలాండ్ సమస్య ఎదురవుతుంది.కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ ప్రణబ్ ముఖర్జీ ది కూడా వెస్ట్ బెంగాల్. అందుకే తెలంగాణ విషయంలో కేంద్రం మాట తప్పడానికే నిర్ణయించుకుంది అంటున్నారు.ఐతే తెలంగాణా విషయంలో డిసెంబర్ తరువాత కేంద్రం తీసుకున్న నిర్ణయాలన్నిపార్టీ తిరోగమనం పాల్జేసే లాగే ఉన్నాయి.ముందు సాగదీద్దాం తరువాత తేల్చేద్దాం అన్న పాతపడ్డ పనికిమాలిన ఆలోచన కేంద్రానికి కొత్త నొప్పులు తెచ్చిపెడుతూనే ఉంది.రాజకీయంగా లబ్ది పొందుదామని చేస్తున్న ప్రయత్నం మొత్తానికే బెడిసి కొడుతుంది.సమయం గడుస్తున్నకొద్దీ ఏ ప్రాంతంలో కూడా క్రెడిట్ దక్కకుండా పోయే పరిస్దితి దాపురిస్తుంది.ఎప్పటికైనా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టడం మంచిది.లేకపోతే కాంగ్రెస్ ఆడుతున్న వికృతమైన రాజకీయక్రీడలో ప్రజలు సమిధలుగా మారే ప్రమాదముంది.ఏది ఏమైనా సమ్మె మరికొన్ని రోజుల కొనసాగునుందని అన్పిస్తోంది.జాక్ కూడా ఇప్పుడు సమ్మె విరమించే పరిస్దితులు లేవు.అదే పనిగానీ చేస్తే అసలైన టైంలో అస్త్రం నిరూపయోగం చేసారన్న అపవాదు ఎదుర్కుంటారు.జనం నుంచి మద్దతు మళ్లీ రాకపోవచ్చు.చూద్దాం ఏం జరుగనుందో..
No comments:
Post a Comment