Friday, November 11, 2011

దారుణం!.....మన దౌర్భాగ్యం!!

పిచ్చి వెర్రితలుల వేస్తూ,మనల్ని మతిలేనివారిగా మారుస్తోందనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఉండదు.11-11-11 అట.. 11 గంటల 11 నిమిషాల 11 సెకన్లంట.... అన్ని అంకెలు ఒకటే నంబర్ అట..ఆ టైం లో పుడితే అదృష్ట లక్ష్మి వరిస్తుందంట.ఆ లక్ నిజమో కాదో తెలియదు కానీ. దానికోసం దాదాపు దేశంలో లక్షల సిజేరియన్లు జరిగాయంట.అనుకున్న సమయం కంటే ప్రసవం జరగాల్సిన టైం కంటే ముందు వెనుక ఉన్నవారు సరిగ్గా ఆ సమయానికే సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకున్నారంట...ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా....పిల్లలు పుట్టడం అనేది సహజమైన ప్రక్రియ.తల్లి కడుపులో పెరిగే పిండం బయటకు వచ్చేందుకు అనువైన సమయం అంటూ ఉంటుంది..అప్పుడే ప్రసవం జరిగితే తల్లి,బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఎవడో ఏదో వాగాడని ,అదృష్టం పట్టుకుంటుందని అపోహపడి తొందరపడి ఇలా సిజరేయన్లు చేయించుకోవడం ఎంత వరకు కరెక్ట్ ?మహిళలే ఇలాంటి కాన్పులు చేయించుకోడానికి డాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారంట.హవ్వ ఎంత అమానుషం.

ప్రతీ మహిళా తల్లి కావాలని తపిస్తుంది.గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్ని కష్టాలెదురైనా భరిస్తుంది.నవమాసాలు మోసి బిడ్డను కంటుంది.వాళ్లకి ఎలాంటి ఆపదా రాకుండా చూసుకుంటుంది. ఆపరేషన్ ద్వారా పుట్టే పిల్లల కంటే నార్మల్ డెలివరీ ద్వారా పుట్టేవాళ్లు ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు చెబుతారు.నార్మల్ డెలివరీ కుదరని అత్యవసర సందర్భాల్లో వైద్యులు సిజేరియన్ చేస్తారు.ఏది ఏమైనా ఆపరేషన్ జరిగినంత సేపు టెన్షన్ తప్పదు.ఎవ్వరికి ఏమీ కాకూడదని దేవుడ్ని మొక్కుతూనే ఉంటాం .టెన్షన్ పడతాం.అంతా మంచి జరగాలని కోరుకుంటాం. ఇదంతా వేరే విషయం.

కానీ డేట్ కోసం ఆ టైం లోని పిల్లలు పుట్టాలని కోరుకుని ఆపరేషన్ చేయించుకోవడం ఎంత సిగ్గుచేటు.జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు కారణం ?ఆపరేషన్ వికటించి ఫ్యూచర్లో ఏమైనా ఆరోగ్యసమస్యలు ఏర్పడితే జీవితాంతం భాదే కదా ?ఈ మాత్రం వాళ్లకి తెలియదా? ఆరోగ్యంగా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టి అందమైన జీవితాన్ని ఆరోగ్యంగా వందేళ్ల పాటూ అనుభవించాల్సిన పిల్లలకు ఇలాంటి పిచ్చి పనుల ద్వారా మనమే ద్రోహం చేయాలనుకోవడం పాపం.వారి బంగరు భవిష్యత్తు కోసం ఈ విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టే భావినిర్మాత జీవితాలతో ఆడుకునే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదు.

ఐనా వినిపించిన ఈ పనికిమాలిన కధలన్నీ నిజమవుతాయని ఆధారాలేంటీ?అన్నీ ఒకట్లు కలిస్తే అదృష్టం అని ఎలా చెప్పగలరు.ఐనా అన్ని ఒకట్లే ఎలా ఉంటాయి.ప్రస్తుత సంవత్సరం నవంబర్ 11 వ తేదీ 11.11.11 ఎలా అవుతుంది.11.11.2011 కదా కావాల్సింది. అంటే ఇది 11 వ సంవత్సరమా..లేక 2011 సంవత్సరమా అది తెలుసుకోవాల్సిన అవసరం లేదా...? డైట్లు రాసే ఫార్మట్ లో రకరకాల మార్పులు వస్తుంటాయి.2011 అని పూర్తిగా రాయలేక షార్ట్ కట్ లో అప్పుడప్పుడూ రాస్తుంటాం.ఎందుకంటే 11 అంటే 2011 అని ఈజీగా అర్దమవుతుంది.కానీ అది నిజం కాదు. ఖచ్చితమైన డేట్ అంటే 2011 అని రాయాల్సిందే.ఈ లెక్క ప్రకారం వరుసగా 1 నంబర్ రానేరాదు. పిచ్చికూతలు కూసారని, లక్ మీ సొంతం అంటే , నిజమేనని నమ్మి అనవసరంగా ఆపదలు కొనితెచ్చుకోవడం భావ్యం కాదు. అదృష్టం పేరుతో పిల్లల జీవితాలతో చెలగాటమాడటం సరైన సంస్కృతి కాదు.బుద్దిమాంద్యం ఉన్నవారే ఇలా చేస్తారనడానికి నేనెంతమాత్రం సందేహించను.

ప్రపంచంలో చాలా దేశాల్లో వైద్యులు ప్రసవం కోసం సిజేరియన్లు ఆవాయిడ్ చేస్తున్నారని ఓ మెడికల్ సర్వే కుండబద్దలు కొట్టింది.ప్రశాంతమైన వాతావరణంలో సుఖప్రసవం జరగాలని అమ్మలూ కోరుకుంటున్నారంట.వైద్యులు కూడా వీలైనంత వరకూ నార్మల్ డెలివరీ చేయించేందుకే తల్లుల్ని ఒప్పిస్తున్నారంట.వారిని మెంటల్ గా ప్రిపేర్ చేసేందుకు క్లాసులు కూడా కండక్టు చేస్తున్నారంట. అలా పుట్టిన పిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని డాక్టరు పరిశోధన చేసి కనుక్కున్నారు. అన్ని తెలిసి ప్రపంచానికి అన్నిరకాల విజ్ఞానం అందించిన మనం ఇలాంటి విషపుమాయలో చిక్కుకుని ఊగిసలాడటం ఎంత వరకు సమంజసం?ఇలాంటి విషపు ప్రచారాలకోసం నూరేళ్ల జీవితాలను పణంగా పెట్టడం మన దౌర్భాగ్యం కాక మరేమిటి?



Wednesday, November 2, 2011

దీక్ష ఒక్కటే ఆయుధమా..?


మళ్లీ ఆమరణ దీక్ష చేస్తానని అన్నాహజారే గర్జించారు.రెండుసార్ల అనుభవం దృష్ట్యా ఆయన ఆ మాట అని ఉండొచ్చు.మళ్లీ దీక్షఅంటే కేంద్రం గజగజ వణికిపోతుందని బహుశా ఆయన భావన అనుకుంటా. అవినీతి పై పోరాడుతున్న క్రూసేడర్ గా కీర్తినందుకుంటున్న అన్నాహజారే ఇలా దీక్ష నే పట్టుకుని వేలాడుతూ ప్రభుత్వాన్ని బెదిరించడం సరైన వైఖరిగా అనిపించడం లేదు. మరోసారి దీక్ష చేయాలని భావించడం తలా తోకాలేని వ్యవహారంలా కనిపిస్తుంది. తన బృందంలోని సభ్యులమీద వస్తున్న అనేకమైన ఆరోపణలనుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ప్రకటన చేసారని అనిపిస్తోంది. వ్యవస్దను జలగలా పీల్చిపిప్పి చేస్తున్న అవినీతిని రూపుమాపేందుకు తాను, తన టీం పోరాటగోదాలోకి దిగిందని అన్నాహజారే మొదట్నుంచీ చెబుతూన్నారు. జనలోక్ పాల్ బిల్లు తీసుకురావాలంటూ ప్రభుత్వం మీద ,రాజకీయపార్టీల మీద ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఆయన ఎంచుకున్న మార్గమేమిటి...?చేస్తున్న పనేమిటి...?గత ఏప్రిల్ లో ఆయన మొదటిసారి దీక్ష చేపట్టారు. ప్రభుత్వం దిగివచ్చినట్లు నటించింది.తరువాత నైజాన్ని బైటపెట్టుకుంది. ఇది హజారే ఈగోను హర్ట్ చేసింది. మళ్లీ దీక్ష చేసారు.మీడియా భూతద్దం లో దేశం నావెంట కదిలొచ్చింది అని అనుకున్నారు.మొత్తానికి ప్రభుత్వం మాత్రం దిగొచ్చింది.కొన్ని సవరణలతో జన్ లోక్ పాల్ కు కట్టుబడి ఉన్నామని చెప్పింది.కానీ ఈ ఆరునెలల కాలంలో అన్నాహజారే అండ్ టీం మీడియా ముందుకు వచ్చినా ఒకటేచెప్పారు.జన్ లోక్ పాల్ బిల్ లావో..భ్రష్టాచార్ కో ఖతమ్ కరో...అంతకుమించి ఏమీ మాట్లడరు.బహుశా హజారే కు అవినీతిపై పోరాడమటమంటే తెలిసింది అదే అనుకుంటా.

పోరాటం ఎల్లప్పుడూ కొంతపుంతలు తొక్కుకుంటూ, తొణికిసలాడే విశ్వాసం తో ముందుకు సాగాలి. ఎన్ని అవరోధాలనైనా అవలీలగా ఎదుర్కోవాలి.ఎప్పటికప్పుడూ కొత్త రూపు సంతరించుకోవాలి.మనం నిజాయితీ గా ఉంటూ ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలి. మీడియాముందుకొచ్చి స్పీచ్ లిస్తేనో, దీక్ష కూర్చుంటా అని బెదిరిస్తేనో ,అవినీతిని అంతం చేయండి పిలుపిలిస్తేనో జరిగిపోదు.అవినీతి నిర్మూలన అనేది దీర్ఘకాలిక పోరాటం. జన్ లోక్ పాల్ బిల్లు తోనే అవినీతి సమూలంగా నాశనమైపోదు. దానికి ఆమరణ నిరాహార దీక్ష ఒక్కటే ఆయుధం కూడా కాదు.మరోవైపు ఈ ఆరునెలల కాలంలో అన్నా హజారే , ఆయన టీం దేశానికి బాగానే పరిచయం అయ్యారు.ఇన్నాళ్లుగా వారు ఏం చేశారు...? ప్రభుత్వాన్ని పార్టీలను తిట్టడం తప్పిస్తే..అన్నాహజారే వెనుక మేం ఉన్నామంటూ మద్దతిచ్చిన యువతీ యువకులు ఏం చేస్తున్నారు..?వి ఆర్ విత్ యూ అన్నా అని టీవీ మైకుల ముందు నినదించిన యువత ఎందుకిప్పుడూ హాయిగా నిద్రపోతోంది. దీక్ష చేసినప్పుడు మాత్రమే వాళ్లు బైటకు వస్తారా..?అవినీతి మూలాలు, అవినీతి అడ్డుకట్టవేసేందుకు కనీసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకుఅన్నా టీం ఒక్కరైనా ,ఒక్కసారైనా ప్రయత్నించారా...ఎన్నిసార్లు దేశమంతా తిరిగారు.ఎంతమందిని కలుసుకున్నారు, ? అవినీతి సంగతి దేవుడెరుగు...కనీసం జన్ లోక్ పాల్ బిల్లు అంటే ఏమిటి..దాని వల్ల ప్రయోజనాలేంటి....అని కొంతమందికైనా తెలియజెప్పే ప్రయత్నం చేయలేదు. ఇలా ఐతే చేస్తున్న పోరాటానికి,పొందబోతున్న ఫలానికి సార్ధకత ఉండదు.

తన టీం నుంచి ఇద్దరు జారిపోయినా, ముఖ్యులందరిపై ఆరోపణల వర్షం కురుస్తుంటే అన్నా మౌనవ్రతాన్ని ఆశ్రయించడం చేతగానితనాన్ని, సమాధానం చెప్పుకోలేని దుస్దితినే సూచిస్తుంది తప్ప మరోటి కాదు.తన ఆరోగ్యం కోసం వైద్యుల సూచన మేరకు అని చెబుతున్నారు. మీడియా అంతా గోల చేస్తుంటే...తనచుట్టూ తిరిగినవాళ్లందరినీ తప్పుబడితే అన్నా కామ్ గా ఉండటం సమంజసం కాదు.అగేనెస్ట్ కరప్షన్ కోసం వస్తున్న విరాళాలు పక్కదారి మళ్లుతున్నాయన్న ఆరోపణలకు అన్నా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.ఆయనను నమ్ముకున్న మద్దతుదారుల అనుమానం తీర్చాల్సిన అవసరం లేదా.కేవలం రెండు నిమిషాలు మౌన వ్రతం పక్కన బెట్టి సమాధానం చెప్పవచ్చు కదా.

అవినీతి రూపేందుకు ప్రయత్నం చేయడం సాహసమే.ప్రశంసించాల్సిన విషయమే..అందుకే కేవలం ప్రభుత్వాన్ని,పార్టీని తప్పుబడుతూ ప్రయోజనం లేదు. లంచాలు ఇవ్వడం ,తీసుకోవడం అలవాటుగా చేసుకున్న వారిలో కూడా మార్పు రానవసరం లేదా?. అలా కానప్పుడు ఎన్ని జన్ లోక్ పాల్ లు వచ్చినా దేశంలోఇసుమంత కూడా మార్పు రాదు.

అన్నా ఇప్పటికైనా తన పోరాట దిశను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.దీక్ష ద్వారా కాదు నేరుగా ప్రజలను అన్నిరకాలుగా తన పోరాటంలో భాగస్వామ్యులను చేయాలి. ఆయన వెనుక ఉండేవాళ్లు నిజాయితీ గా ఉండేలా చూసుకోవాలి.అలా లేనివారిని నిరభ్యంతరంగా పక్కనబెట్టాలి.తన ఉద్దేశ్యాలేమిటో స్ఫష్టంగా ప్రజలముందుంచాలి. అవినీతి నరనరాన ఇంకిపోయిన భారత వ్యవస్ద ను మళ్లీ కడిగేయాలంటే అంత ఈజిగా అయ్యే పనికాదు.అందరినీ కలుపుకుపోవాలి.ఓర్పుకూడా ఉండాలి.లేకపోతే అన్నాబృందం కోరుకుంటున్న లక్ష్యం ఎండమావే అవుతుంది.